మంచి ఇల్లు, లగ్జరీ కారు కొనుక్కోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే.. అంత పెద్ద మొత్తం డబ్బులు పెట్టలేక చాలా మంది వారి కలలు అలానే మిగిలిపోతాయి. అలాంటి వ్యక్తికి ఏదైనా మంచి బంపర్ ఆఫర్ ఇచ్చి.. తక్కువ ధరకే కారు ఇస్తాము అంటే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఓ వ్యక్తి కూడా అలానే గంతేశాడు. అయితే.. అది మోసం అని తెలిసుకునేలోపు చాలా నష్టపోయాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగ‌ళూరుకు చెందిన వ్యాపార‌వేత్త ఖ‌లీల్ ష‌రీఫ్‌కు సెకండ్ హ్యాండ్ మెర్సిడిస్ కారు త‌క్కువ ధ‌ర‌కే ఇస్తామంటూ ఓ వ్య‌క్తి ఆఫ‌ర్ ఇచ్చాడు. ఇంకేముందీ.. ఇంత చీప్‌గా కారు దొరుకుతున్నందుకు తెగ‌ సంతోషపడ్డాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండ‌లేదు. 

ష‌రీఫ్ ఓసారి జీవ‌న్ బీమాన‌గ‌ర్‌లోని గ్యారేజీకి వెళ్లాడు. అక్క‌డ గ్యారేజీ య‌జ‌మాని బంధువు ద‌స్త‌గిరి ప‌రిచ‌య‌మ‌య్యాడు. అత‌ను 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కే మెర్సిడిస్ ల‌గ్జ‌రీ కారు ఇస్తానంటూ ఆశ చూప‌డంతో.. అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు ష‌రీఫ్ సిద్ధ‌ప‌డ్డాడు. మార్చి 11న గూగుల్ పే ద్వారా తొలుత 78 వేల రూపాయ‌ల‌ను అత‌నికి చెల్లించాడు.

 దీంతో మ‌రో రెండు రోజుల్లో ఇంటి ముందు కారు ఉంటుంద‌ని ద‌స్త‌గిరి మాటిచ్చాడు. కానీ రెండు రోజులు కాదు క‌దా, రెండు నెల‌లు దాటిపోయినా అత‌ని ద‌గ్గ‌ర నుంచి కారు ఊసే లే‌దు. అత‌నికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వ‌చ్చేది.

లాక్‌డౌన్ వ‌ల్ల‌ వీలు కావ‌డం లేదేమోన‌ని మూడు నెల‌లు ఎదురు చూశాడు. ఆ త‌ర్వాత కూడా ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ష‌రీఫ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. తీరా అక్క‌డికి వెళ్లేస‌రికి ద‌స్త‌గిరి పేరు మీద ఇదివ‌ర‌కే‌ 30 కేసులు ఉన్న‌ట్లు తేలింది.