'ఆ ఎంపీ ఎవరిని తిడతాడో ఆయనకే తెలియదు'

15 Oct, 2015 23:56 IST|Sakshi
'ఆ ఎంపీ ఎవరిని తిడతాడో ఆయనకే తెలియదు'

హైదరాబాద్ : ‘కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎప్పుడు ఎవరిని తిడతాడో ఆయనకు సోయి లేకుండా పోయింది. ఆయనకు రోజు రోజుకూ పిచ్చి ముదురుతోంది. సొంత పార్టీ, బయటి పార్టీ అన్న తేడా ఏమీ లేకుండా ఎవరు గుర్తొస్తే వారిని నోటికి వచ్చినట్లు తిట్టడం అలవాటుగా మారింది..’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఢిల్లీలో పాల్వాయి నోటికొచ్చినట్లు విమర్శలు చేశారని, ఆయన చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న పాల్వాయి చేసిన అభివృద్ధి ఏమిటని నిలదీశారు.

ఫ్లోరైడ్ పీడిత మునుగోడు నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టయినా ఎందుకు తీసుకు రాలేక పోయారు? ఆయనకు ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. 46వేల చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, పల్లెపల్లెకు తాగునీరు అందించేందుకు మొదలు పెట్టిన వాటర్ గ్రిడ్ పథకాలకు ప్రశంసలు దక్కుతుంటే ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం ఆ పథకాలపై విషం కక్కుతున్నాయని, ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నాయని విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ వైఖరు మార్చుకోవాలని బోడకుంటి హితవు పలికారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు