హైదరాబాద్‌: ఫలించిన యాభై ఏళ్ల కల! 

Hyderabad: Railway Under Bridge At Tukaram Gate Came Into Force - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: ‘తుకరాంగేట్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద నిర్మించిన ఆర్‌యూబీ అమలులోకి వచ్చింది. యాభై సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితం అయిన వంతెన కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి వచ్చింది. 2018 జూలై నుంచి అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్‌ ఆంక్షలు తొలగిపోయాయి.  

► కరోనా తదితర సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగి ఐదేళ్ల కాలంలో నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కొద్ది రోజుల క్రితమే నిర్మాణం పూర్తయిన వంతెనను రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, డిప్యూటీ స్పీకర్‌ టీ.పద్మారావుగౌడ్‌ వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపారు. 

► ఐదు దశాబ్దాలుగా ఎన్నికల నినాదంగా మారిన వంతెన నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి రావడంతో తుకారాంగేట్‌ పరిసర ప్రాంతాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే వంతెన అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు సమూలంగా పరిష్కారం లభించినట్టయింది.  
చదవండి: ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్‌ బ్రిక్స్‌ తయారీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

26 సార్లు గేట్‌ పడేది...  
► సికింద్రాబాద్‌ నుంచి లాలాపేట్, మల్కాజిగిరి ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు తుకారాంగేట్‌ రహదారి ఒక్కటే పెద్దదిక్కుగా ఉంది. నిత్యం లక్ష వాహనాల రాకపోకలు ఈ దారిగుండా ఉంటున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు అంచనా వేస్తున్నారు. 

► తుకారాంగేట్‌ రైల్వే క్రాసింగ్‌ మీదుగా నిత్యం వంద వరకు రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ప్రతీ 40 నిమిషాలకు ఒకమారు లెవల్‌ క్రాసింగ్‌ వద్ద గేటు వేసేవారు. మొత్తంగా రోజుకు 20 నుంచి 26 సార్లు గేటు పడుతుండడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయేవి.  

► రూ.20.10 కోట్ల వ్యయంతో తుకారాంగేట్‌ ఆర్‌యూబీ నిర్మాణం పనులు పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ, దక్షిణ మధ్యరైల్వేలు సంయుక్తంగా వంతెనను నిర్మించారు. జీహెచ్‌ఎంసీ రూ.15.14కోట్లు, రైల్వేశాఖ రూ. 13.95 కోట్లు విడుదల చేయడం ద్వారా నిర్మాణం పనులు పూర్తి చేశారు.
చదవండి: వినూత్న ‘పెండ్లిపత్రిక’.. పారేయకండి.. మట్టిలో పాతిపెడితే.. 

ట్రాఫిక్‌ మళ్లింపులకు తెర  
► వంతెన నిర్మాణం పనులు ప్రారంభం అయిన కొద్ది రోజుల ముందు నుంచి తుకారాంగేట్‌ రహదారి మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌ నుంచి తుకారాంగేట్‌ రైల్వేగేట్‌ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు.

► నాలుగు సంత్సరాల అనంతరం తుకారాంగేట్‌ రైల్వే వంతెన మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మల్కాజిగిరి, మౌలాలి, నేరెడ్‌మెట్‌ తదితర ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్యలు తప్పాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top