Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
నవ తెలంగాణ- ఖమ్మంరూరల్
ఈ నెల 11 న మహాశివరాత్రిని పురస్కరించు కొని మండలం లోని తీర్ధాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగే జాతరలో రెండు వందల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ తెలిపారు. తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. నిర్వాహకులు ఆలయ స్వాగత ద్వారం మొదలుకొని, గర్భాలయం వరకు క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా చొరవ తీసుకోవాలని పోలీసులకు, నిర్వాహకులకు తెలిపారు. పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాప్ ఇతర ప్రాంతాల దగ్గర బారికేడ్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలన్నారు. స్నానపు ఘాట్, ఇతర ప్రాంతాలలో నిరంతర విద్యుత్ కోసం ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర కోసం నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, ముప్పై మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, అరవై మంది కానిస్టేబుల్లు, తొబ్భై మంది హౌమ్ గార్డ్ లను కలిపి మొత్తం రెండు వందల మందిని నియమించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ మురళీధర్, ఏఎస్పీ స్నేహ మెహ్రా, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్నకుమార్, ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ బాణాల రాము, జడ్పీటీసీ వర ప్రసాద్, సర్పంచ్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.