సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్త్రీ (సీఐఐ)కి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ నుంచి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)కు ‘గోల్డ్’ కేటగిరిలో గుర్తింపు లభించింది. గత నవంబర్ 25 నుంచి 26 వరకు బెంగళూరులో జరిగిన క్వాలిటీ సమ్మిట్ 30వ ఎడిషన్లో భారతదేశం నుంచే కాకుండా విదేశాలకు చెందిన గోద్రేజ్, భారత్ ఎలక్ట్రానిక్స్, బాష్, టీవీఎస్ గ్రూప్, టాటా గ్రూప్, దుబాయ్ క్వాలిటీ గ్రూప్, అమెరికన్ సొసైటీ ఆఫ్ క్వాలిటీ వంటి ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయి. అయితే జీఎంఆర్ రూపొందించిన బిజిలెన్స్ ఎక్సలెన్స్ మోడల్ (జీబీఈఎం)కు గాను ఈ గుర్తింపు లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘మాల్కం బాల్ద్రిడ్జ్ బిజినెస్ ఎక్సలెన్స్ ఫ్రేమ్ వర్క్’ ఆధారంగా రూపొందించబడిన బిజినెస్ ఎక్సలెన్స్ మోడల్ను చాలా హై పర్ఫార్మెన్స్ కంపెనీలు అనుసరిస్తున్నాయి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, ఐడియా ఫ్యాక్టరీ, నాలెడ్జ్ మేనేజ్మెంట్, సీఎస్ఏటీ ప్రాసెస్, కస్టమర్ ఫిర్యాదు నిర్వహణ ప్రక్రియలను మెరుగుపర్చడం, భద్రత అంశాలను మెరుగుపరచడంలోనూ ఇది సహాయపడుతుంది. ‘గోల్డ్’ కేటగిరిలో గుర్తింపు రావడం పట్ల జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ పణికర్ హర్షం వ్యక్తం చేశారు. తమ సమర్థవంతమైన పనితీరుకు మరోసారి గుర్తింపు లభించిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.