Lake Front Park Opening Hyderabad Today : హుస్సేన్సాగర్ వద్ద సరికొత్త అందాలు.. నేడే 'లేక్ ఫ్రంట్ పార్కు' ప్రారంభోత్సవం
Lake Front Park Opening Hyderabad Today : హుస్సేన్సాగర్ వద్ద సరికొత్త అందాలు.. నేడే 'లేక్ ఫ్రంట్ పార్కు' ప్రారంభోత్సవం
Lake Front Park Opening Hyderabad Today : హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ రోజు రోజుకూ కొత్త అందాలను సంతరించుకుంటోంది. ఇప్పటికే ట్యాంక్బండ్, లుంబినీ పార్కుతో పాటు ఇటీవల నూతన సచివాలయం, అమరవీరుల స్మారకం, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుండగా తాజాగా మరో పార్కు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమైంది. సాగర్ సుందరీకరణలో భాగంగా రూపొందించిన లేక్ ఫ్రంట్ పార్కును మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించబోతున్నారు..
KTR To Inaugurate Lake Front Park Today : హైదరాబాద్ అనగానే టక్కున గుర్తుకొచ్చేది హుస్సేన్సాగర్. నగరానికి వచ్చిన ఎంతో మంది దేశ, విదేశీ పర్యాటకులు ట్యాంక్బండ్ అందాలను ఆస్వాదిస్తారు. సాగర్ తీరానికి మరో ఆకర్షణగా సర్కార్ లేక్ ఫ్రంట్ పార్క్ను సిద్ధం చేసింది. జలవిహార్ పక్కనే ఉన్న 10ఎకరాల విస్తీర్ణంలో 4 ఎలివేటెడ్ వాక్వేలు ఏర్పాటు చేశారు. సాగర్లోకి వ్యూపాయింట్ కోసం కాంటీలివర్ జెట్టి, కర్విలినియర్ వాక్వే, 690మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు గల నడక మార్గాలను నిర్మించారు. ఆర్కిటెక్టర్ అంశాలలో మండపాలు, పంచతత్వ నడక మార్గం, సెంట్రల్ పాత్వే, అండర్పాస్లు మొదలైనవి ఉన్నాయి..
Lake Front Park at Hussain Sagar Hyderabad : లేక్ ఫ్రంట్ పార్క్లో 15మీటర్ల వరకు నీటిపై డెక్తో కాంటిలివర్గా అభివృద్ధి చేశారు. ఇల్యుమినేటెడ్ లైట్ శిల్పాలు, డెకరేటివ్ లెడ్, హైమాస్ట్ లైటింగ్, థీమ్ పోస్ట్టాప్లు ఏర్పాటు చేశారు. వివిధ రకాలైన 4లక్షల మొక్కలతో పచ్చదనాన్ని రూపొందించారు. కొన్ని 25ఏళ్ల చెట్లను రీ-ప్లాంటేషన్ చేయగా సువాసనలు వెదజల్లే అరుదైన మొక్కలను సైతం అభివృద్ధి చేశారు హెచ్ఎండీఏ మొదటి సారిగా బార్ కోడింగ్ నేమ్ బోర్డులను ఏర్పాటు చేసింది. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ గదులు, శౌచాలయాల వంటి సకల సౌకర్యాలను కల్పించింది.
మొత్తం 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ లేక్ పార్కును ఉదయం ఐదున్నర నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు తెరచి ఉంచుతారు. ప్రవేశ రుసుము పిల్లలకు 10, పెద్దలకు 50రూపాయలుగా నిర్ణయించారు. మార్నింగ్ వాకర్ల నుంచి నెలకు 100 రూపాయలు వసూలు చేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. ఇప్పటికే ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ పెరుగుతుండగా ఈ పార్కు ప్రారంభిస్తే నెక్లెస్ రోడ్ మరింత రద్దీగా మారనుంది.
ఇప్పటికే ట్యాంక్ బండ్, అంబెడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్ దగ్గర వారాంతాలు వస్తే ట్రాఫిక్ పెరిగి భారీగా రద్దీ నెలకొంటోంది. ఈ పార్క్ ప్రారంభిస్తే నెక్లెస్ రోడ్ మరింత రద్దీ కానుంది. ఇక వీటితో పాటు ఇవాళ నగరంలోని పంజాగుట్టలో మరమ్మతులు చేసిన గ్రేవ్ యార్డును, పార్శిగుట్టలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మంత్రి ప్రారంభించనున్నారు.