సంగారెడ్డి : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య(Doddi Komaraiah) జయంతి, వర్ధంతిని ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతికుమారి జీవో విడుదల చేశారు. జీవో విడుదల పట్ల తెలంగాణ రాష్ట్ర షెఫర్డ్ ఇండియా అధ్యక్షుడు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పానగేశ్ ఆధ్వర్యంలో సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్(CM KCR) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడుతూ తెలంగాణలో భూ స్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. ఆయన జయంతిని ఏప్రిల్ 3న, వర్థంతిని జూలై 4న అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(Government Orders) జారీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 3న రాజధానిలోని రవీంద్రభారతిలో దొడ్డి కొమురయ్య 96వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడానికి సహకరించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR), మంత్రులు కె తారకరామారావు(KTR), తన్నీరు హరీశ్రావు(Harish Rao)కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కురుమలు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని వెల్లడించారు. కురుమలు కోరిన వెంటనే ఆత్మ గౌరవాన్ని పెంచి జీవో విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపల్లి పాండు, యూత్ అధ్యక్షుడు కొల్కూరి ప్రవీణ్ కురుమ, నవాబుగారి భూమయ్య, మాజీ డైరెక్టర్ పెద్దగొల్ల నగేశ్, బీసీ కన్వీనర్ గోరుకఅంటి రమేశ్, బీసీ యూత్ అధ్యక్షుడు కొత్తగొల్ల సోమశేఖర్, పెద్దగొల్ల రాంచందర్, కారికే యాదయ్య, ఎల్వర్తి మల్లేశ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.